టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో పరిశీలన కోసం దేవినేని ఉమ వెళ్లగా జి.కొండూరు ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయని చెబుతూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇదే సమయంలో దేవినేని తన అరెస్ట్ అక్రమమని హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ వచ్చింది. దేవినేని ఉమపై ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్టు పిటిషనర్ ఏ నేరానికీ పాల్పడలేదన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు కూడా విన్న కోర్టు చివరకు దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసింది.