రాజకీయ వ్యూహాల్లో దిట్ట అని పేరు తెచ్చుకున్న సీఎం కేసీఆర్ తాజాగా చేసిన కామెంట్స్ తో ప్రత్యర్ధులకు కొత్త అస్త్రాన్ని అందించారు. ప్రత్యర్ధులకు చిక్కకుండా..వారి నోటికి తాళం వేయబోయి అడ్డంగా బుక్ అయ్యారు కేసీఆర్. ఎప్పుడు మైక్ పట్టినా ప్రత్యర్ధులపై విరుచుకుపడే కేసీఆర్..ఈసారి మాత్రం వాళ్లకే కత్తి అందించి కొత్త చిక్కుల్లో పడ్డారు.
మాటల గారడీతో ప్రత్యర్ధులను చిక్కులో పడేస్తారు కేసీఆర్. ఎక్కడా ఎన్నిక జరిగినా మొదట్లో ప్రచార శైలి ఎలా ఉన్నా..చివరాఖరులో ఆయన ప్రసంగమే ఓట్లను రాలుస్తుంది. బులెట్ లాంటి పదాలతో ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి కేసీఆర్…మాట్లాడుతూ..మాట్లాడుతూ ఫ్లోలో నోరుజారాడో లేక చెప్పాలని చెప్పాడో ఏమో కాని…హుజురాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే దళిత బంధు అంటూ ప్రకటించారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాన్ని అందించారు. హుజురాబాద్ లో దళితుల ఓట్లే అధికంగా ఉన్నాయి. అక్కడ 45వేల వరకు దళిత ఓట్లున్నాయని… ఈ తెలంగాణ దళిత బందుతో కేసీఆర్ వన్ సైడ్ ఓటింగ్ జరిగేలా ప్రయత్నిస్తున్నాడన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మాటలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. ఫ్లోలో కేసీఆర్ అసలు విషయం చెప్పేశాడని… కేసీఆర్ ఏ పథకం తెచ్చినా రాజకీయ లబ్ధి కోసం చూస్తాడని మరోసారి రుజువైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యర్థులను మాట్లాడకుండా చేసేందుకు చేసిన ప్రకటన ఇప్పుడు టీఆర్ఎస్ నోటికే తాళం పడేలా చేసిందని… ఇది వ్యూహత్మక తప్పిదమని… ఈ మాటలే హుజురాబాద్ లో దళిత ఓట్ల చీలికకు కారణం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని… అదే జరిగితే కేసీఆర్ బొక్కబోర్లా పడ్డట్లేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.