రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన ఏదీ లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయినా జనాల్లో లాక్ డౌన్ అనుమానాలు తొలగలేదు. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారేమోనని, 144 సెక్షన్ విధిస్తారేమోనని భయపడుతున్నారు. దీంతో ఈ అంశంపై రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించే ఆస్కారం లేదన్నారు. ప్రజలే కరోనా నిబంధనలు పాటించాలన్నారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా వ్యాక్సిన్ డోసులు ఎక్కువ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి ఈటల చెప్పారు. అలాగే 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ను కోరామన్నారు. అలాగే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా సెకండ్ వేవ్ గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని.. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరిగా చేయాలని మంత్రి సూచించారు.