ఈ నెల 12న మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో కార్పొరేషన్ లోని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పనులపై పంచాయతీ రాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఈ మధ్య హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ తో జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఆయా పనుల ప్రగతి తీరుని అధికారులతో చర్చించారు. ఉగాది నుంచి వరంగల్ లో ప్రతి ఇంటింటికీ మంచినీటిని ప్రతి రోజూ ఇవ్వాలన్న నిర్ణయంలో భాగంగా 95వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. అయితే, స్లం ఏరియాల్లో తప్పనిసరిగా కనెక్షన్లు అందేలా చూడాలన్నారు. రూ.1 కే కనెక్షన్ కింద ప్రతి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఒక్క మిషన్ భగీరథ పథకం కిందే గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థలో ఇప్పటి వరకు రూ.1000 కోట్లు ఖర్చు చేసినట్లు వారు వివరించారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేయాలని మంత్రులు జిల్లా కలెక్టర్ వరంగల్ నగర కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతిలను ఆదేశించారు.