కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ ను దేశ పౌరులంతా కలిసి పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మార్చి 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రోడ్లులు మూత పట్టనున్నాయి. అటు ప్రజా రవాణా కూడా బంద్ కానుంది. అలాగే మార్కెట్లు, జనసాంద్రిత ప్రదేశాలను సైతం మూసివేయనున్నారు. ఇప్పటికే భారత్ బంద్ కు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.. దీనికి తోడు భారత్ బంద్ విజయవంతం చేయాలని ర్యాలీలు, రాస్తారోక్ లు నిర్వహించారు. అలాగే ప్రతి ఒక్కరూ పాల్గొని భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కూడా… ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బంద్ ను శాంతియుతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
రైతు సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాశారని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ కానున్నట్లు స్పష్టం చేశారు.