హుజురాబాద్ బైపోల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సడెన్ గా ఈసీ షెడ్యూల్ విడుదల చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ముందు జాగ్రత్తగా హుజురాబాద్ లో పార్టీ నేతలతో ముమ్మర ప్రచారం చేయిస్తోంది టీఆర్ఎస్ అధిష్టానం…కాని బరిలోకి ఎవర్ని దించాలనే విషయంలో టీఆర్ఎస్ తర్జన భర్జన పడుతోంది. సర్వే ఫలితాలు కూడా టీఆర్ఎస్ కు ఆశాజనకంగా లేకపోవడంతో…గులాబీ బాస్ వ్యూహాలకు పదును పెట్టారు.
దళితుల అభ్యున్నతి కోసం దళిత సాధికారిత పథకం ద్వారా నియోజకవర్గంలోని వంద మందికి 10లక్షల రుణాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దళిత సాధికారిత పథకాన్నికి పేరు మార్చి తెలంగాణ దళిత బంధు అనే పేరును ఖరారు చేసింది టి. సర్కార్. అయితే…హుజురాబాద్ బైపోల్ వాసనను పసిగట్టిన కేసీఆర్…’తెలంగాణ దళిత బంధు’ అనే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద మొదట హుజూరాబాద్ నియోజవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు. హుజురాబాద్ లో 40 వేలకు పైగా దళిత సామాజిక వర్గ ఓట్లు ఉండటంతో…తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఇక్కడి నుంచి అమలు చేస్తే ఆ ఓట్లన్నీ టీఆర్ఎస్ కు రాలే అవకాశం ఉందని భావించి ఈ మాస్టర్ ప్లాన్ కు కేసీఆర్ తెర తీశారని అంటున్నారు విశ్లేషకులు. దీనిని బట్టి కేసీఆర్ కు హుజురాబాద్ పై ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు.
తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తే ఎలాగూ దళితుల ఓట్లు టీఆర్ఎస్ కు పడే అవకాశం ఉన్నందున్న…అధికార పార్టీ అభ్యర్థిని అదే సామజిక వర్గం నుంచి బరిలోకి దించే అవకాశం లేన్నట్లు కనబడుతోంది. హుజురాబాద్ లో దళితుల తరువాత అధిక ఓట్లు ఉన్న మరో సామజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. దాంతో అటు దళితుల ఒట్లతోపాటు, మరో సామజిక వర్గం ఓట్లు కూడా టీఆర్ఎస్ కే పడతాయని గులాబీ బాస్ అంచనా వేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.ఆ ఆలోచనతోనే హుజురాబాద్ను పైలట్ నియోజకవర్గంగా ఎంచుకున్నారని అంటున్నారు. కాని టీఆర్ఎస్ నేతల వర్షన్ మాత్రం మరోలా ఉంది. గతంలో రైతు బంధు పథకాన్ని హుజురాబాద్ నుంచే కేసీఆర్ ప్రారంభించారని.. ఆ సెంటిమెంట్తోనే దళిత బంధు పథకాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించాలని అనుకుంటున్నారని.. టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.