వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ తవ్వకాలతో ఖనిజ సంపదను లూటీ చేస్తున్న వైనం తాజాగా మరొకటి బయటపడింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలని చెబుతూ ప్రజల కళ్ళుగప్పి మాయ చేస్తోంటే… ఇదే అదనుగా వైసీపీ నేతలు ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా అలెగ్జాండరైట్ రంగురాళ్ల అక్రమ తవ్వకం బయటపడిందన్న ఆయన.. విశాఖజిల్లాలోని గొలుగొండ మండలంలో నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు జరుపుతున్న తవ్వకాలను గురించి తెలిపారు. సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్టులో జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరి తెగింపో చూడండని వాటికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్విస్తున్నారని.. ఇది వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. ఆ పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ‘‘ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటం.. ఈ నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు’’ అని లోకేశ్ నిలదీశారు.