కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి 60 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. టీకా ఉత్సవ్లో భాగంగా ఒక్కరోజే 6,28,961 డోసులు ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీలోనే ఎక్కువ డోసులు ఇచ్చామని సీఎం తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందన్నారు.
ప్రతి 50 కుటుంబాల అవసరాలను ఒక వాలంటీరు తీరుస్తున్నారని ప్రధానికి వివరించారు. వ్యాక్సిన్ డ్రైవ్ను ఏపీలో వాలంటీర్లు సమర్థంగా చేపట్టారన్నారు. అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా చూస్తున్నామన్నారు. వచ్చే మూడు వారాల్లో ఏపీలో 45 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ఆ లక్ష్య సాధన కోసం ఏపీకి 60 లక్షల డోసులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.