సైబర్ కేటుగాళ్లు సామాన్యులతో పాటు ప్రముఖులను కూడా వదలడం లేదు.. వారి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి, అశ్లీల చిత్రాలు ఉంచడంతో పాటు వారి నుంచి భారీగా డబ్బును డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖమంత్రి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అనంతరం హ్యాకర్లు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గౌతమ్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.
తన ట్విటర్ ను హ్యాక్ చేశారని, అందులో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ట్వీట్ చేశారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నానని, అలాంటి పోస్టులను పట్టించుకోవద్దంటూ తన ఫాలోవర్లకు, ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ట్విట్టర్ సంస్థకు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు దీనిపై ఏపీ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ఖాతాను ఎవరు హ్యాక్ చేశారు.. ఎక్కడ నుంచి హ్యాక్ అయింది అనే విషయాలపై పోలీసులు దృష్టిసారించారు. దీనిపై త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.