ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో జాన్ పూర్ జిల్లా బక్షా డెవలప్ పెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడి 26వ వార్డు నుంచి మోడల్, అందాల రాణి దీక్షా సింగ్ బరిలోకి దిగుతున్నారు.
2015లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పైనలిస్ట గా దీక్షా సింగ్.. ప్రైవేటు ఆల్బమ్స్ తో పాటు పలు ప్రకటనల్లో నటించారు. ఇప్పుడు తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దీక్ష తండ్రి జితేంద్ర సింగ్ వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బక్షా డెవలప్ మెంట్ బ్లాక్ లోని 26వ వార్డు నుంచి పోటీ చేసేందుకు చాలా రోజుల నుంచి సిద్ధమయ్యారు. అయితే, ఈ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో దీక్షను బరిలోకి దించుతున్నారు.
ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థి షాలినీ సింగ్ తో తలపడనున్నారు. దీక్ష స్వస్థలం బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామం. అయితే వ్యాపార రీత్యా గోవాలో స్థిరపడింది. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్ లో ట్రాన్స్ పోర్టు బిజినెస్ నిర్వహిస్తున్నారు. కాగా, యూపీలో ఏప్రిల్ 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ పూర్ జిల్లాలో తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 15న పోలింగ్ నిర్వహించనున్నారు.